శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Tuesday, 6 June 2023

అటవీ శాఖ ఆధ్వర్యంలో దోర్నాలలో ఉద్యానవనం(Mini forest )

 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దోర్నాలలో మినీ ఫారెస్ట్ ఏర్పాటు.

దోర్నాల(ప్రకాశం జిల్లా ) లో శ్రీశైలం వెళ్లేదారిలో గణపతి చెక్ పోస్ట్ వద్ద చిన్న అడవిని సృష్టిస్తున్నాము రండి అని దోర్నాల FRO విశ్వేశ్వర రావు గారు ఆహ్వానించడం తో APNGC తరపున నేను సజీవ రాజు, ప్రదీప్ వెళ్ళాము. దిగగానే Coffee shop ఏర్పాటు ఆకట్టుకునే design తో కనిపించింది. అలాగే ప్రక్కన అమరుడైన అటవీ ఉద్యోగి రాజారావు జ్ఞాపకంగా ఒక సమావేశపు గది నిర్మించారు.NSTR (Nagarjuna sagar Tiger reserve forest )వివరాలు తెలియజేసే విశాలమైన ద్వారం, చెక్ పోస్ట్, ఓ ప్రక్కన గణపతి మందిరం కొద్దిగా దగ్గరిలో హరిత resorts ఇలా ఈ ప్రాంతం అప్పటికే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక కుడివైపున అటవీ శాఖవారి ఖాళీస్థలం కొండకు దిగువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఒక చిన్న అడవిగా మార్చాలని సంకల్పించారు FRO U.విశ్వేశ్వర రావుగారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్ DFO విగ్నేష్ గారు హాజరైయి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.విశ్వేశ్వరావు గారి మాటల్లో ఈ క్రింది విధంగా ఈ project ను అభివృద్ధి చేయాలని  సంకల్పించారు.

1) NSTR ప్రజా ఉద్యానవనం :

April 22 న earth day సందర్భం గా కడియం నుండి 1000 పెద్ద మొక్కలు తెప్పించి మొదటి దశలో నాటారు అవన్నీ ప్రస్తుతం బాగా చిగుర్లు వేసి ఆహ్వానిస్తున్నాయి.ఇంకా 1000 మొక్కలు ఇందులో నాటాలి. ఇందులో 25 రకాల  అటవీ, పూల, పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇందులో మర్రి చెట్టు దాని చుట్టూ ఒక అరుగును ఏర్పాటు చేయాలి.

2)సాహస క్రీడల ఉద్యానవనం :ఇందులో మొక్కలతో పాటు rope activities, Zip line, బంగీ jump, ల్యాండ్ zorbing, Body Zorbing, spring toys వంటి విభిన్న క్రీడా అంశాలు ఉంటాయి.

3)బహిరంగ వ్యాయామశాలను ఏర్పాటు చేయడం

4)ఖగోళ పరిశీలనా కేంద్రం :ఇందులో ఒక telescope ను అమర్చి  అంతరిక్షాన్ని  గ్రహ, నక్షత్ర గమనాలను పరిశీలించే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు.

5)NSTR People's memorial park:ఇందులో ప్రజలు ఎవరి మొక్కను వారు నాటుకునే విధంగా ప్రోత్సా హిస్తూ వారి నామ ఫలకం, ఒక ప్రశంసాపత్రం ఇచ్చి ప్రజా ఉద్యానవనంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు రచించారు

6) చెంచు కళా వేదిక: చెంచుల జీవనశైలి,సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయబోతున్న ఒక సాంస్కృతిక వేదిక ఇది.

7)అకిరో మియావాకి పద్ధతి :అడవిని పోలిన  వృక్షజాతులను దగ్గరిగా నాటి దట్టమైన అడవిని తక్కువ కాలంలో తయారు చేసే పద్ధతి. ఇది జపాన్ లో ఆవిష్కరించ బడిన సాంప్రదాయే తరపద్ధతి. canopy, వృక్షజాతులు,scrubs ఇలా విభిన్న రకాలు తక్కువ ప్రాంతం లో పెంచడం అవి పరస్పరం సహకరించుకుని చక్కని పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి.మామూలు చెట్ల కంటే ఈ పద్దతిలో చెట్లు,మొక్కలు వాతావరణం నుండి 30% ఎక్కువగా CO2 ను గ్రహిస్తాయి. soil, moisture conservation దీనివల్ల బాగా జరుగుతుంది. దీన్ని చక్కటి ప్రణాళికతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

8)వెదురు వనం :భారత దేశం లోని విభిన్న వెదురు జాతుల మొక్కలను తెచ్చి ఒక వెదురువనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు 

9) మామిడి వనం :40 రకాల మామిడి మొక్కలు తెచ్చి పెంచాలనే నిర్ణయం జరిగింది 

10) విభిన్న రకాలయిన వృక్ష జాతులు ఒక చోట ఉండే విధంగా ఒక Botanical garden ను ఏర్పాటు చేయబోతున్నారు.Bi.PC విద్యార్థులకు ఇది ఒక వరం.

*** ఇది అంతా Dornal FRO U. విశ్వేశ్వర రావు గారి brain child.

ఆయన చెబుతుంటేనే నాకు ఎంతో exiting గా అనిపించింది.ఇహ పూర్తి రూపు సంతరించుకున్న తరువాత ఈ project లో విహరిస్తే అన్నింటిని మరిచిపోయి ఆనందించ వచ్చు.అటవీశాఖ వారు మార్కాపురం ప్రాంత వాసులకు ఇవ్వబోయే అద్భుతమైన కానుకగా భావించవచ్చు. అంతే కాదు శ్రీశైలం వెళ్లే యాత్రికులు దోర్నాలలో ఒక రోజు ఆగి ఈ ఉద్యానవనాల్లో వివరించ వచ్చు. ఇహ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇదో ఆనంద వేదిక అవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది పండుగే. ఈ విషయాలు అన్ని తెలుసుకుని సమాజం లోని విభిన్న వర్గాలు Dornal FRO గారిని కలిసి తమ యొక్క సహకారాన్ని, మద్దతును తెలియజేయండి.ఈ కార్యక్రమానికి దోర్నాల వాస్తవ్యులు మణి అనే యువకుడు ఆర్ధిక, హార్థిక సహాయం అందిస్తూ అత్యంత ఉత్సాహం గా పాల్గొన్నారు. ఇటువంటి చైతన్య వంతమైన యువకులే ప్రస్తుతం అత్యవసరం. ఆయనకు అభినందనలు.ఇహ june 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2023 మొక్కలు నాటాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మీ APNGC ని ప్రత్యేకంగా ఆహ్వానించామని FRO గారు చెప్పడం చాలా ఆనందం కలిగించింది.ఇందులో ప్రకాశం జిల్లా APNGC coodinator M.సజీవ రాజు, మార్కాపురం APNGC క్లస్టర్ Coodinator ఒద్దుల రవిశేఖర్, గణిత ఉపాధ్యాయుడు ప్రదీప్, M.కృపాకర్ గార్లు హాజరయ్యారు......ఒద్దుల రవిశేఖర్ 

Thursday, 6 April 2023

దార్శనికుడు (Scientist)

 దార్శనికుడు(Scientist)

అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )



Sunday, 28 August 2022

మన అమ్మమ్మ ఇల్లు అక్కడే

 మన అమ్మమ్మ ఇల్లు అక్కడే.....




మీ అమ్మమ్మ పేరు ఏంటి? మరి వాళ్ళ అమ్మమ్మ పేరు? ఉహూ తెలీదు కదూ!మన మైటో కాండ్రియా ఈవ్ (అంటే మనందరి అమ్మమ్మమ్మ.......) పుట్టిన ఊరు ఆఫ్రికా ఖండం లో   ఉందట.ఈ విషయం మైటో కాండ్రియా DNA ద్వారా Scientist లు నిరూపించారు. ఇంతకు ముందు post మొత్తం చదవండి, మానవులంతా బంధువులే ననే వాస్తవం తెలుస్తుంది.విద్యార్థుల్ని నేను ఎప్పుడు మీ నాన్న పేరు ఏమిటి, వాళ్ళ నాన్న పేరు ఏమిటి? అంటూ వెనక్కి అడుగుతూ ఉంటాను. 3,4 తరాలు చెప్పగలరు ఎవరయినా!మా నాన్న గోవిందరెడ్డి 13 తరాల మా వంశ వృక్షం నా కందించి వెళ్లారు.అలాగే ప్రస్తుతం జనాభా ఎంత? అలా 100,200, 1000,10,000 ఏండ్ల క్రిందట జనాభా ఎంత ఉండొచ్చు అని అడుగుతుంటా!అలా 2,00,000 ( రెండు లక్షల) సం.క్రితంకొద్ది మంది హోమో సే పియన్స్ సమూహమే ప్రస్తుత మానవజాతి అంతా.DNA ఆధారంగా మానవులంతా బంధువులే అని నిరూపించింది సైన్స్. ఈ ఆధారం మరో తిరుగులేని సాక్ష్యం. ప్రతి ఒక్కరిలో ఈ భావం పాఠశాల స్థాయి నుంచే నేర్పితే ప్రపంచం ఇలా ఉండదు.... ఒద్దుల రవిశేఖర్.


Tuesday, 5 July 2022

అడవులు.. భూమికి ఊపిరి తిత్తులు

 

అడవులు భూమికి ఆక్సిజన్ అందించే జీవనా డులు. అటువంటి వాటిని యదేచ్చగా నరికి వేస్తూ మానవుడు తన భవిష్యత్తును తానే బలి పెట్టుకుంటున్నాడు. అడవులు నశిస్తే భూమి ఉష్ణోగ్రత పెరిగి మంచు ఖండాలు కరిగి సముద్ర తీరప్రాంతాలు నీట మునగడం వల్ల కొన్ని కోట్లమంది నిరాశ్రయులవుతారు. వాతావరణ అసమతౌల్యం వల్ల అతి వృష్టి అనా వృష్టి వరదలు, కరువు వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.ప్రపంచ వ్యాప్తంగా 31% అడవులు ఉన్నాయి. కానీ 33% ఉంటే సమతౌల్య స్థితి ఉన్నట్లు.ప్రపంచం మొత్తం అడవుల్లో 20% రష్యా లో,10% కెనడా లో ఉన్నాయి.భూటాన్ భూభాగం లో 71% అడవులే. ఇంకా అత్యధికంగా అడవులు ఉన్న దేశాలు అమెరికా కెనడా చైనా. మనదేశం లో 24.39% మాత్రమే ఉన్నాయి అడవులను పరిరక్షిస్తూ వాటిని సమృద్ధిగా పెంచవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది..(https://reliefweb.int/report/world/state-world-s-forests-2020-forests-biodiversity-and-people-enarru)

Thursday, 23 June 2022

విజ్ఞాన శాస్త్రాలు అవకాశాలు

 రచయితలు : A.P.J అబ్దుల్ కలాం, సృజన్ పాల్ సింగ్ అనువాదం :త్రిమూర్తి                           పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్                                       ఇతరుల జీవితాల్లో ఎటువంటి మార్పు తేగలం అన్న మనస్తత్వం కలిగి ఉంటారు శాస్త్రవేత్తలు.ఈ పుస్తకం 7 విభిన్న విజ్ఞాన  శాస్త్రాల శాఖల గురించి అందులో ఉన్న అవకాశాల గురించి తెలియ జేస్తుంది.1) రోబో విజ్ఞాన  శాస్త్రo:భవిష్యత్ రోబో శాస్త్రం ప్రగతిని గురించి,మానవాకార రోబో అసిమో, జీవ ప్రేరిత రోబోల గురించి వివరిస్తారు.2) వైమానిక శాస్త్రo :విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు (1903). Bernouli  సూత్రాన్ని ఇందులో ఉపయోగిస్తారు.శబ్ద వేగం (1200km/hr)కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ విమానాలు,సూపర్ సోనిక్ విమానాలు(6000km/hr) వంటి ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెంది మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇందులో తెలిపారు. 3) వ్యాధి నిర్ణయ శాస్త్రవేత్త:

మొదటగా లూయీ పాశ్చర్ సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేశారు. సైనో బాక్టీరియా అనే సూక్ష్మజీవుల వలన 2.3 బిలియన్ సం. క్రితం భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి అయింది. బాక్టీరియా వైరస్ ల గురించి చక్కని వివరణ ఇచ్చారు. కాన్సర్, HIV వ్యాధులు కలిగించే కారకాల గురించి టీకా ల గురించి వివరించారు. రచయిత సృజన్ పాల్ సింగ్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రూపకర్త.4) అంతరిక్ష శాస్త్రవేత్త:విశ్వం గురించి పరిశోధించిన శాస్త్రవేత్త ల ను పరిచయం చేస్తారు.విశ్వ పరిణామాన్ని అంచనా వేయడంలో జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరిస్తారు.అబ్దుల్ కలాం గారు ఇందులో తన విశేషమైన అనుభవాన్ని పంచుకుంటారు.       5) నాడీ శాస్త్రవేత్త:మనిషి మెదడు గురించి విశేష మైన, అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.మెదడు, యంత్రం సంధానం అప్పుడే ప్రారంభమయ్యింది. ఇందులోని అవకాశాలు నాడీ శాస్త్ర నిపుణుడు డా. జోగి వివరిస్తారు.6)పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్త:విమానాలు మెరుపుల తాకిడి కి గురికాకుండా అల్యూమినియం లోహ మిశ్రమాలు వాడుతారు. మానవ పరిణామ క్రమం లో రాగి, వెండి, ఇనుము లోహాలను ఉపయోగించి పరికరాలను తయారు చేసుకున్నాడు. తరువాత నేడు అనేక మిశ్రమ లోహాలను తయారు చేస్తున్నాడు.ఇందులో ఉన్న అవకాశాలను కలాం గారు వివరిస్తారు.   7)పురాజీవ శాస్త్రవేత్త:వీరు వేల, లక్షల సం. క్రితం భూమి మీద జీవ స్వరూపాలు ఎలా ఉండేవో శిలాజాలను అధ్యయనం చేసి తెలుసుకుంటారు. భూమి ఏర్పడ్డ 455 కోట్ల సం. నుండి భూమి మీద జరిగిన మార్పులను చక్కగా తెలిపారిందులో. ఈ రంగం లో నిపుణుడైన Dr. అశోక్ సాహని మంచి సూచనలు అందించారు.ఇలా విభిన్న మైన కోర్సులు ఉండగా డాక్టర్, software ఈ రెండు రంగాలనే మన విద్యార్థులు ఎంచుకోవడంతో అక్కడా సరయిన ఉపాధి అవకాశాలు కరువైతున్నాయి. ఉపాధ్యాయులు గా మనం ఈ పుస్తకం లోని కోర్సుల గురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

Thursday, 24 December 2015

పారిస్ లో పర్యావరణ సదస్సు(COP-21)--1

                       పారిశ్రామిక విప్లవం సాధించిన అత్యద్భుత ప్రగతి మానవులందరూ నివసించాల్సిన   ఈ భూమి అస్తిత్వానికే ప్రమాదంగా పరిణమించింది .20 వ శతాబ్దం లో మానవ జీవనం,జాతి ప్రగతి అనే రెండు విషయాలు పరస్పర విరుద్దాలుగా మారాయి .
             1972 లో UNO పరిసరాల పరిరక్షణ,పారిశ్రామిక ప్రగతి మధ్య ఎటువంటి వైరుధ్యమూ లేకుండా సమతుల్య త సాధించాలని పిలుపు నిచ్చింది.అభివృద్ధి పేరిట మానవాళి సృష్టిస్తున్న కాలుష్యం,అడవులు నరికివేస్తూ ప్రకృతితో చెలగాటం భూగోళం వేడెక్కి పోయేలా చేస్తున్నాయి.UNO 190 దేశాల భాగస్వామ్యం తో  November 30-Dec11 వరకు PARIS లో COP-21 జరిగింది.
                  పెట్రోలు డీజల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి భూతాపం పెరుగుతుంది పారిశ్రామిక విప్లవం  ముందరి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి .1992 రియోడి జేనరీ క్యోటో,బాలి కోపెంహాగాన్ సదస్సుల్లో కొంత పురోగతి కనిపించింది .
   (ఈనాడు లో వచ్చిన వ్యాసాల సంక్షిప్త సారాంశం .వారికి ధన్యవాదాలు .వరుసగా ఈ అంశం పై వ్యాసాలూ వస్తాయి )

Wednesday, 7 October 2015

మన ముత్తాతల్ని వెతకొచ్చు

             8 తరాల కిందట చీకటిఖండ మైన ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిన సిద్ధిస్ లు ఆఫ్రో ఇండియన్స్ అని తేలింది.5 వేల ఏండ్ల క్రిందట చీకటి ఖండంలో బంటు జాతులుగా గుర్తింపు పొందారు.వారు అటునుంచి 2500 ఏండ్ల క్రిందట సముద్ర మార్గం ద్వారా ఆ దేశాన్ని వీడారని ఆధారాలతో బయట పెట్టింది CCMB(centre for cellular and molecular biology).15 నుంచి 19 శతాబ్దాల మధ్య వీరంతా మన దేశంలోని గుజరాత్,కర్నాటకల్లో అడుగు పెట్టారు.అటునుంచి  హైదరాబాద్ కు చేరుకొని చార్మినార్ వద్ద స్థిర పడ్డారు.నల్లటి చర్మం,రింగులు తిరిగిన జుట్టు మలేరియా దోమ కాటులను తట్టుకునే వారే sidhdhis లని తేలింది.ప్రస్తుతం వీరు పహిల్వాన్లుగా వున్నారు.
          తాజాగా మరో పరిశోధనలో ఐరోపాకు మన దేశానికి మధ్య బందుత్వాన్ని నిరూపించింది.ఐరోపాలో వుండే జిప్పీ లపై పరిశోధించారు.25 వేల ఏండ్ల క్రిందట దక్షిణ భారత దేశం నుంచి ఉత్తరాదికి అటునుంచి ఐరోపా దేశాలకు వెళ్ళిన మన దళితులు జిప్సీలుగా మారినట్లు తెలిసింది.
  వై క్రోమోజోం:
మానవ దేహం ఏర్పడటానికి X,Yక్రోమోజోం లు ప్రధాన పాత్ర పోషిస్తాయి .స్త్రీ లలో X  క్రోమోజోం లే ఉండగా పురుషులలో రెండు రకాలు ఉంటాయి.ఇందులో Y క్రోమోజోం వ్యక్తీ పుట్టుకకు కీలక భూమిక వహిస్తుంది. దాన్ని విశ్లేషిస్తే తరాల రహస్యాన్ని చేదిస్తుంది.CCMB  శాస్త్ర వేత్తలు  DNA మార్కింగ్ విధానం
ద్వారా జన్యువుల సమాచారం తెలుసుకుని మానవ సమాజాల మూలాల్ని వెతికి పట్టుకుంటున్నారు.
  CH.Mohan Rao,director,Deepa selvarani,scientist ,K.Thangaraj,A.GReddy,Rakesh thamang,Neeraj  ఈ ప్రాజెక్ట్ పై పరిశోధనలు నిర్వర్తిస్తున్నారు .వారిని అభినందిద్దాము .
(ఈనాడు వారికి ధన్యవాదాలు )

Thursday, 1 October 2015

ఆసియన్లకు మనమే ఆదిమూలం

ఎటునుంచి ఎటు ?
        ఆసియా ప్రాంతం లో మానవ ప్రస్థానం ఎటునుంచి ఎటు సాగింది ? దీనిపై ఎన్నో సిద్ధాంతాలు మన ముందుకు వచ్చాయి.వినిపించేది మాత్రం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి తరలివచ్చి మైదాన ప్రాంతంమైన ఉత్తర భారతంలో స్థిర పడ్డారన్న వాదన!అయితే తాజా పరిశోధన ఈభావనను తల క్రిందులు చేస్తుంది. ఆది మానవులు ఆఫ్రికా నుంచి ఒక పంక్తిగా ప్రస్తుత భారత ఉపఖండ ప్రాంతం లో   స్థిర పడ్డారని అక్కడినుంచి ఆగ్నేషియాకు,తూర్పు ఆసియా ప్రాంతాలకు తరలి వెళ్ళారని ఈ జన్యు అధ్యయనం స్పష్ట మైన నిర్ధారణకు వచ్చింది .
*వారు  భూభాగం  ద్వారానే భారత్ లో ప్రవే శించి  నప్పటికీ కోస్తా తీరం వెంబడి సాగుతూ  దక్షిణ భారతం లోకి చొచ్చుకు పొతూ ఆసియా ప్రాంతాలకు విస్తరించారు. 
*ఎప్పుడు? సుమారు లక్ష సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం . 
ప్రాశస్త్యం అనూహ్యం :
ఆఫ్రికాలో ఆవిర్భవించిన ఆధునిక మానవులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ఎక్కడికక్కడ స్థానిక   వాతావరణ పరిస్థితులకు అక్కడి ఒత్తిళ్లకు,అందుబాటులో ఉన్న ఆహార వనరులకు,పరిసర,సూక్ష్మ క్రిములకు అనుగుణంగా మారుతూ  వలసలు పోతూ భిన్న ప్రాంతాల్లో స్థిర పడ్డారన్నది నేడు శాస్త్ర ప్రపంచం బలంగా విశ్వసిస్తుంది . 
*ఆఫ్రికా నుంచి వచ్చిన ఆది మానవులు  వేర్వేరు బృందాలుగా భారత్ చైనా జపాన్ తదితర ప్రాంతాలను చేరుకున్నారని ఇప్పటి వరకు అంతా భావి స్తూ వచ్చారు. అయితే ప్రస్తుత అధ్యయనం ఈ నమ్మకాలను పూర్తిగా పటా పంచలు చేసింది. 
*ఈ అధ్యయనం ప్రకారం ఆసియా వాసుల ఉమ్మడి పూర్వీకులు తొలిగా భారత ప్రాంతానికి వచ్చారు . అక్కడినుంచి థాయ్ ల్యాండ్  దక్షిణ దిశగా ఇప్పటి మలేషియా ఇండోనేషియ తూర్పు దిశగా ఫిలిఫ్ఫీన్స్ ఇలా విస్తరించారు . అనంతరం దశల వారిగా ఉత్తర దిశలుగా వలస పో తూ అప్పటికే అక్కడ స్థిరపడిన వారితో మమేక మవు తూ  భిన్న ఆసియా జాతుల ఆవిర్భావానికి కారకులయ్యారు . 
*ఆసియా ఖండం లో దక్షిణం నుంచి ఉత్తర దిశగా పోతున్న కొద్దీ వివిధ జాతుల్లో జన్యు పరంగా వస్తున్న మార్పులేమిటన్నది దీనిలో స్పష్టంగా గుర్తించటం విశేషం .
*ప్రతిష్టాత్మక మానవ జీనోమ్ సంస్థ  (హ్యుగో ) ఆసియన్ల జన్యువుల పై జరిపిన తొలి అధ్యయనం ఇది . 
* ఐరోపా కేంద్ర భావన లకు ఇది చరమగీతం ..ఎడిసన్  లూ (సింగపూర్ జీనోం సంస్థ )
* ఫ్లూ H.I.V లాంటి వ్యాధులకు ఔషధాలు కనిపెట్టే టప్పుడు ఆ ఔషధ పరీక్షలను భారత్ లో నిర్వహిస్తే చాలు. అది  ఇతర ఆసియా ప్రాంత వాసులకు అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది . .సమీర్. కె . బ్రహ్మచారి డైరెక్టర్(CSIR)  

Saturday, 26 September 2015

తరతరాల వంశ వృక్షం రెడీ

               మన పూర్వీకుల గురించి మనకే మాత్రం తెలుసు. మహా అయితే 4 తరాల వరకు తెలిసి ఉంటుంది .కనీసము 10,000 సంవత్సరాల నాటి మన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం అమెరికాలోని oxford Ancestors కంపెనీని సంప్ర దిమ్చాల్సిందే .. మన శరీరం లోని జన్యు సమాచారం ఆధారంగా ఇది సాధ్యం అవుతుంది . జన్యు అమరికకు దగ్గరగా ఉండే జన్యువులు ప్రస్తుతం ఎక్కడ వున్నాయో  గుర్తిస్తే చాలు . మానవ జన్యువుల్లో తేడాలు  తక్కువ కాబట్టి తప్పుడు సమాచారం అందుతుందని  అనుకునేందుకు వీలు  లేదు . ఈ కంపెనీ Mitochondrial DNA విశ్లేసిస్తుంది.ee రకమైన ప్రక్రియను  వంశా వ్రుక్షాలను  తెలుసుకునేందుకు  ఉప యోగిస్తారు .
              ఆక్స్ఫర్డ్  University లో human genetics professor అయిన brain syx కు తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వల్లేMytocandrial DNA విశ్లేషణకు ప్రాధాన్యం లభించిందని చెప్పవచ్చు .ఈ పద్ధతిలో  జరిగిన  పరిశోధనలోsyx  తాను రష్యన్ చక్రవర్తి నికోలస్ 2 కు బంధువని తెలుసుకున్నాడు . ఆ తర్వాత oxford ancestor company ని స్థాపించాడు . తరాలు మారేకొద్దీ పూర్వీకుల సంఖ్య రెట్టింపవుతుంది . అంటే తల్లి తండ్రి ఇద్దరు ఒక తరం అనుకుంటే తాతల తరం వచ్చే నాటికి వీరి సంఖ్యా నాలుగుకు పెరుగుతుంది . ప్రత్యేకత ఏమిటి ? Mytocandrial DNA చాలా నెమ్మదిగా నాశనం అవుతుంటుంది .20000 ఏళ్లకు ఒకసారి ఇందులోని base pairs లో మార్పులు వస్తుంటాయి. అందు వల్లే  పురాతత్వ త్రవ్వకాలలో బయటపడే ఎముకలలో nuclearDNA నాశన మైన చాలా ఏండ్ల  తరువాత కూడా Mytocandrial DNA చాయలు కనిపిస్తాయి
                 syx ప్రతిపాదన ప్రకారం సుమారు 1,50,000 ఏళ్లకు ముందు ఆఫ్రికా ప్రాంతానికి చెందినా  ఒక మహిళా నివసించేది. ఆమె కెన్యా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందినది . అప్పట్లో నివసించిన మహిళా DNAనే తరువాత తరాలకు వారసత్వం గా వచ్చింది . ఈమెనే Mytocandrial ఈవ్ అన్నారు . ఆమె ఊహా చిత్రాన్ని కూడా తయారు చేసారు . కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆమె వారసులు ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచం నలుమూలలకు  వ్యాపించారు . వారు ఎ దిశగా ప్రయాణించారు ఎక్కడెక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు అనే విషయం కనుగునే ప్రయత్నం లోsyx దాదాపు పదేళ్ళు గడిపాడు .దీని కోసం ఆయన కొన్ని వేల మంది Mytocandrial  sequence  లను పరిశీలించారు . ఆయన విశ్లేషణ ప్రకారం ఈవ్ సంతతికి చెందినా తెగలు ఆఫ్రికా  లో 13,మిగిలిన ప్రాంతం లో మరో 13 ఉన్నాయి . లక్ష సంవత్సరాల క్రితం ఈ తెగలు చిన్న చిన్న గుంపులుగా ఆఫ్రికా నుంచి తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లి ఆప్రాంతం లో దాదాపు 50000 సంవత్సరాలు  గడిపాయి . ఈ కాలం లో తెగల సభ్యుల   సంఖ్య  బాగా పెరిగిపోయింది. దానితో  పాటు Mytocandrial DNA లో మార్పులు కూడా జరిగాయి వీరిలో కొందరు యూరప్ లోకి వెళ్లి స్థిర పడ్డారు .
యురోపియన్స్ లో 95 శాతం మంది  7 Mytocandrial  తెగలకు చెందినా వారని syx  అంచనా .ఈ ఏడూ తెగలకు చెందినా తల్లులకు ఆయన హెలినా,జాస్మిన్,కేత్రీన్ తారా ,ఉర్సులా ,వెళ్దా ,జేనియా  అని నామకరణం చేసారు .
(  thanks to eenaadu) 

Friday, 25 September 2015

ప్రాణ వాయువు పుట్టింది ఇలా !


                  భూమిపై ఒకప్పుడు ఆక్షిజన్ లేదు! ఉన్న కొన్ని ప్రాణులు సూర్య రశ్మి సాయం తో మనగలిగేవి. భూ   వాతావరణం ....ఈ దశ నుండి ఆక్షిజన్ ఆధారిత దశకు చేరిందేలా ?
           ఈ చిక్కుముడిని  విప్పేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాప్రయత్నం ఒకటి ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.దాని ప్రకారం ఒకప్పుడు మంచు ముద్దగా ఉన్న భూమి  కరిగి నీరయ్యే దశలో వాతావరణం లోకి సముద్రాల్లోకి ఆక్షిజన్ను  విడుదల చేయడంతో జీవ జాతులన్నీ ఆక్షిజన్ ఆధారంగా మనగలగడం సాధ్యమయింది.
       భూమిపై ఆక్షిజన్ లేని సమయంలో ప్రాణులు సూర్య రశ్మి సాయంతో బ్రతికేవని ముందుగానే చెప్పుకు న్నాము.ఇది కూడా ఒక రకమైన కిరన జన్య సంయోగ క్రియనే.వాతా వరణంలోని సల్ఫర్ ఇనుములను ఉప యోగించుకుని ప్రాణులు శక్తిని ఉత్పత్తి చెసుకునేవి.అయితే 230 ఏండ్ల క్రితం భూమి మొత్తం మంచు ముద్దగా మారిపోయింది.ఎంతగానంటే భూ ఉపరితలం పై కొన్ని మైళ్ళ  మందం లో మంచు పేరుకు పోయేంత .ఈ దశలో ఓ కీలక మైన మార్పు చోటు చేసుకుంది.అతి నీల లోహిత కిరణాల కారణంగా మంచు పొరల్లో H2O2  ఉత్పత్తి అవుతుంది.సాధారణంగా నయితే సూర్య రశ్మి సోకినప్పుడు H2O2 నాశనం అవుతుంది.అప్పట్లో భారీ స్థాయిలో మంచు పొరలు ఉండటం వలన  లోపలి పొరల్లో కొద్దిపాటి H2O2  అలాగే  ఉండి పోయింది. మంచు గ్రహంగా పేరొందిన గురుగ్రహం పై కూడా H2O2 ఆనవాళ్ళు ఉన్నట్టు శాస్త్ర వేత్తలు గుర్తించారు.
    మంచుయుగం ముగిసినప్పుడు H2O2 వాతావరణంలోకి సముద్రాల్లోకి విడుదలయ్యింది .ఇది కూడా దశల వారిగా నెమ్మదిగా జరగడం వలన అప్పటికి ఆక్షిజన్ లేకుండానే బ్రతికేస్తున్న ప్రాణులకు హాని జరగలేదు.కాక పోతే ఈ రకమైన పరిస్థితికి అలవాటు పడేలా ఈ ప్రాణులు కొన్ని enzymes ను తయారు చేసుకోవడం వీలయ్యింది .పరినామ క్రమంలో జీవులు ఈ enzymes ఆధారంగా ఆక్షిజన్ ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి .ఇలా భూమికి పచ్చదనం అబ్బింది అన్నమాట .
(ఈనాడు పత్రిక ఆధారంగా ,వారికి కృతజ్ఞతలు .)